schedule Saturday, June 13, 2026

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం

calendar_today December 21, 2024
person meenewstelugu

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 21::: ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన తెలంగాణలో కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి తిరస్కరించింది.పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీ రాజ్ ను ఆదేశించింది. దీంతో శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో దీనికి సవరణ చేయలేదు. ఇతర అంశాలతో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి రాష్ట్రంలో.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పురపాలక, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేశారు. ప్రస్తుతం కుటుంబ నియంత్రణ పై అవగాహన పెరిగినందుకు పాత నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. దీనికి కొందరు మంత్రులు హామీ ఇచ్చారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ..చట్టసవరణ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చి మంత్రిమండలి ఆమోదానికి పెట్టింది. దీనికి మంత్రిమండలి అనుమతించలేదు. తెలంగాణలో సంతానోత్పత్తి రేటు పై శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయనే కారణంతో ఈ ప్రతిపాదనను నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ ఒక్కటి మినహా మిగిలిన అన్ని ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది. దీనికి అనుగుణంగా చట్టసవరణ బిల్లును రూపొందించి పంచాయతీరాజ్ శాఖ బిల్లును ప్రవేశపెట్టింది. మొన్నటి వరకు ఆశావహులుగా ఉన్న వ్యక్తులకు ఈ ప్రకటనతో నిరాశే మిగిలినట్లయింది. గ్రామీణ స్థాయిలో పోటీ చేసే వారికి కనీస విద్యా అర్హతలైనా పాటిస్తే చట్టాల అమలు పై అవగాహన ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆశావహులుగా ఉన్న వ్యక్తుల్లో నిరాశే మిగిలింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ప్రకటిస్తే చట్టాల పట్ల విధుల పట్ల కనీస అవగాహన ఉంటుందని కొందరి అభిప్రాయం.