schedule Saturday, June 13, 2026

నల్లగొండ కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

calendar_today September 4, 2024
person meenewstelugu

నల్లగొండ కలెక్టర్ తో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 

జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి.

నిరంతరం అధికారులతో టెలికాన్ఫరెన్స్

ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలకు ఆదేశం.

ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ -1800 4251 442

---ప్రజలు ఏ అవసరం ఉన్నా కాల్ చేయాలని సూచన.

మీ:: న్యూస్ ప్రతినిధి 

నల్లగొండ జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు.. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలను కోరారు. జిల్లాలో గ్రామాల వారీగా కురుస్తున్న వర్షాపాతం.. జిల్లాలోని తాజా వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ తో సమాచారం తెప్పించుకుంటున్న మంత్రి.. కలెక్టర్ తో పాటు ఇతర జిల్లా అధికారులకు నిరంతరం తగు సూచనలు చేస్తున్నారు. వర్షం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్కరు విధులకు గైర్హజరు కాకుండా చూసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసకోవాలని, విద్యుత్ స్తంభాలకు విద్యుత్ సరఫరా జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది వీధివీధిలో అలెర్ట్ గా ఉండి మ్యాన్ హోల్స్ అడ్డంకులను తొలగించి వర్షపునీరు వెళ్లేలా చూడాలని చెప్పారు. కూలిపోయేందుకు అవకాశం ఉన్న ఇండ్లలో ఉంటున్న ప్రజలను తక్షణం ఖాళీ చేయించాలని.. ఎంతమంది ప్రజలు వచ్చినా ఇబ్బందులు రాకుండా ఉండేలా పునరావాసా కేంద్రాన్ని తక్షణం అందుబాటులోకి తేవాలని మంత్రి కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇవే కాకుండా.. గ్రామాలు, పట్టణాలలోని మంచి నీటి ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టడంతోపాటు, అంటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ లను చేపట్టాలని తెలిపారు. అంతేకాదు, వైద్య బృందాలను అప్రమత్తం చేయాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగు మందులను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్పా ఇళ్లు విడిచి బయటకు రారాదని.. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రభుత్వ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు.
ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, ట్రాన్స్ కో, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులంతా అందుబాటులో ఉంటూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేసే విధంగా సిబ్బంది 3 షిఫ్టులుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.
ప్రజలకు ఏదైన తక్షణ సహాయం అవసరంఉంటే.. 1800 4251 442 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ప్రాణహాని, ఆస్తి నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పనిచేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు.