మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 23::సూర్యాపేట(రూరల్) : అక్రమంగా తన ఇంటి గోడను కూలగొట్టి సీసీ రోడ్డు పోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితులు దాసరి మైసయ్య కోరారు. ఆదివారం మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో ఆయన నివాస ప్రహరి గోడ ధ్వంసం చేసిన ప్రదేశంలో మీడియాతో మాట్లాడారు. 2004లో 304 సర్వే నెంబర్లో భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేసుకున్నట్లు చెప్పారు. గత కొంత కాలంగా గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు తమ ఇంటి గోడను తొలగించి అక్కడ నుంచి అక్రమంగా రోడ్డు వేయాలని ప్రయత్నిస్తుంటే అధికారులను, కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.ఈ విషయమై ఎంపీడీవోతో పాటు మండల అధికారులకు కోర్టు నుంచి రోడ్డు వేయొద్దని నోటీసులు సైతం ఇచ్చామన్నారు. అయినా గ్రామానికి చెందిన దాసరి శ్రీను, పోకల వరుణ్, సూరారపు యుగేంధర్, దాసరి నర్సయ్య, మేడి లచ్చయ్య, జయమ్మ, పుష్ప, నిర్మల, సుశీలతో పాటు కొంత మంది తాము ఇంట్లో లేని సమయం చూసి గోడను తొలగించి 9 ఫీట్ల వెడల్పుతో రోడ్డును పోశారని వాపోయారు. అక్రమ రోడ్డును తొలగించి ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవద్దని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.